రంగారెడ్డి జిల్లా షాబాద్ను ఉలిక్కిపడేలా చేసిన ఆరుగురి వరుస హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, పక్కా ప్రణాళికతోనే రైలెక్కి పారిపోయాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని పట్టుకునేందుకు సుమారు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఘోర హత్యాకాండకు పాల్పడిన తర్వాత రాజ్కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతానని చెప్పడంతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మొదట భావించారు. అయితే, నందిగామ సమీపంలో నిందితుడి కారును, మొబైల్ సిగ్నల్ను పోలీసులు గుర్తించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా, అతను కారును వదిలేసి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు స్పష్టమైంది. దీంతో రైల్వే స్టేషన్లోని దృశ్యాలను విశ్లేషిస్తున్న పోలీసులు, అతను ఆత్మహత్య చేసుకోలేదని, తప్పించుకునేందుకే రైలు మార్గాన్ని ఎంచుకున్నాడని తేల్చారు.
పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?
ఈ దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గతంలో ఓ మైనర్ బాలికను వేధించిన కేసులో పోక్సో చట్టం కింద అరెస్టయిన రాజ్కుమార్, జైలు నుంచి విడుదలయ్యాక కక్ష పెంచుకున్నాడు. ‘మీ అంతు చూస్తా’ అంటూ బాధితుల కుటుంబాన్ని బెదిరించాడు. ఈ విషయంపై వారు స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. “అతడే భయపడుతున్నాడు. మీరేం కంగారు పడొద్దు” అని కేసు దర్యాప్తు అధికారి అయిన ఎస్సై రమేశ్ తేలిగ్గా తీసిపారేసినట్లు బాధితులు వాపోతున్నారు.
వారి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించని కారణంగానే శనివారం ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు మొదట బాలిక, ఆమె తల్లి, నానమ్మను దారుణంగా నరికి చంపి, ఆ తర్వాత తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా హతమార్చాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు షాబాద్ ఎస్సై రమేశ్ను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిందితుడు ఏ రైలు ఎక్కాడు, ఎక్కడికి పారిపోయాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
