జూన్ 21న నిర్వహించనున్న NEET-UG 2026 రీ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని ప్రకటించింది. పరీక్ష రాసే అభ్యర్థులు అదే రోజు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్కు చేరుకోవడానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 16న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను NSUI రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి కలిసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక జూన్ 17న మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామం నుంచి కరీంనగర్ నగరానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలు, ఇతర ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET-UG 2026 పరీక్ష నిర్వహణలో పలు విద్యార్థి-హిత మార్పులను ప్రకటించింది. పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచి మొత్తం 195 నిమిషాలుగా నిర్ణయించింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది.