నల్లగొండ జిల్లా కనగల్లో ఈ నెల 17న జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై అనిశ్చితి కొనసాగుతోంది. పర్యటన వాయిదా పడిందా? లేక పూర్తిగా రద్దు చేశారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే, ఇప్పటి వరకు సీఎం పర్యటనకు సంబంధించి ఎలాంటి అధికారిక షెడ్యూల్ ఖరారు కాలేదని సీఎంవో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యటన కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను కూడా నిలిపివేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వెల్లడించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సభా ప్రాంగణం చిత్తడిగా మారడంతో పాటు, పెద్ద టెంట్లు ఏర్పాటు చేయడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.