దేశ టాపర్గా శుభమ్ కుమార్
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి పరీక్షలో Indian Institute of Technology Delhi జోన్కు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కామన్ ర్యాంక్ లిస్ట్లో శుభమ్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి దేశ టాపర్గా నిలిచారు. మొత్తం 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు.
ఈ ఏడాది టాప్-3 ర్యాంకులు అన్నీ ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థులకే దక్కడం విశేషం. కబీర్ చిల్లర్ 329 మార్కులతో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించగా, జతిన్ చాహర్ 319 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు.
మహిళా అభ్యర్థుల్లో ఆరోహి దేశ్పాండే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆమె 280 మార్కులు సాధించి ఆల్ ఇండియా 77వ ర్యాంక్ పొందడంతో దేశంలో అత్యధిక ర్యాంక్ సాధించిన మహిళా అభ్యర్థిగా నిలిచారు.
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. మొత్తం 1,87,389 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, మే 17న నిర్వహించిన పేపర్-1, పేపర్-2 పరీక్షలకు 1,79,694 మంది హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విజయవంతమైన అభ్యర్థుల్లో 10,107 మంది మహిళలు ఉండటం విశేషం.
ఫలితాల విడుదలతో ఇప్పుడు విద్యార్థుల దృష్టి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) 2026 కౌన్సెలింగ్పై పడింది. అర్హత సాధించిన సుమారు 57 వేల మంది అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం పొందనున్నారు. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో పేర్కొన్న అర్హతా ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులకే ఐఐటీలలో తుది ప్రవేశం లభించనుంది. కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని ప్రముఖ ఐఐటీలు మరియు ఇతర అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.