డీమానిటైజేషన్ సమయంలో పాత కరెన్సీ నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన కేసులో సికింద్రాబాద్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అంతతాలి యాదగిరి (49)కి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4.5 కోట్ల భారీ జరిమానా విధించింది.
2017లో బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న యాదగిరితో పాటు మొత్తం 17 మందిని పోలీసులు రెడ్హ్యాండెడ్గా

అరెస్ట్ చేశారు.
రూ.1.20 కోట్ల కరెన్సీ బదిలీ
అరెస్టు చేసిన నిందితులను పోలీసులు విడివిడిగా విచారించి.. అనంతరం కేసుకు సంబంధించిన చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. పాత కరెన్సీ నోట్లకు బదులుగా అక్రమంగా రూ.1.20 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను బదిలీ చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు కోర్టుకు తెలిపారు.
కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం 11 మందిని దోషులుగా నిర్ధారించింది. ప్రధాన నిందితుడు అంతతాలి యాదగిరికి 3 సంవత్సరాల 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.4.5 కోట్ల జరిమానా విధించింది.
మరో 10 మంది దోషులకు ఒక్కొక్కరికి రూ.60 వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మిగిలిన నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.