తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మహిళా, శిశు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో డైరీలో నోట్స్ రాసుకుంటూ వార్తల్లో నిలిచిన ఆయన, ఈ తనిఖీ సమయంలోనూ చేతిలో డైరీతో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆరోగ్య శాఖ మంత్రి కె.జి. అరుణ్రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి విజయ్ ప్రసూతి, గైనకాలజీ వార్డులతో పాటు పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమై విధుల్లో ఎదురువుతున్న సవాళ్లపై చర్చించారు.

ఈ ఆసుపత్రిలో లంచాల వేధింపులు, పారిశుద్ధ్య లోపంపై ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ తనిఖీ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోపాలను వెంటనే సరిదిద్దాలని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యటన సందర్భంగా ప్రసవానంతర వార్డులలోని బాలింతలతో ముఖ్యమంత్రి విజయ్ ముచ్చటించారు. కొందరు నవజాత శిశువులను చేతుల్లోకి తీసుకుని లాలించారు.