పంట పొలంలో బంగారు ఆభరణాలు.. వాటా కోసం పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ

NEWS DESK
2 Min Read

వరంగల్ జిల్లాలోని ఓ వ్యవసాయ పొలం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ పొలంలో పంట కాకుండా బంగారం దొరికిందనే వార్తతో రైతులు ఆ భూమిని కౌలుకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దొరికిన బంగారు ఆభరణాల పంపకాల వివాదం చివరకు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి యాజమాన్యంలోని ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బాలు అనే రైతు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంట కోసం దుక్కి దున్నుతున్న సమయంలో నాగలికి తగిలి కొన్ని బంగారు ఆభరణాలు బయటపడినట్లు సమాచారం.

బంగారు ఆభరణాలు లభించిన తర్వాత వాటిని రహస్యంగా ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వాటా విషయంలో కౌలు రైతు, వ్యవసాయ కూలీల మధ్య వివాదం తలెత్తింది. దొరికిన బంగారం మొత్తం తనకే చెందుతుందని కౌలు రైతు చెప్పడంతో కూలీలు ఈ విషయాన్ని బయటపెట్టారు. విషయం భూమి యజమాని ప్రతాప్ రెడ్డి దృష్టికి వెళ్లగా, ఆయన ఇరువర్గాలను మందలించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ప్రతాప్ రెడ్డి ఈ భూమిని ఆరు సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం బంగారు ఆభరణాలు దొరికాయన్న విషయం తెలుసుకున్న మాజీ యజమాని జైపాల్ రెడ్డి కూడా వాటాలో తనకు హక్కు ఉందని দাবি చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది.

స్థానికుల కథనం ప్రకారం, ఈ ప్రాంతంలో గతంలో కాకతీయుల కాలానికి చెందిన ఆలయాలు ఉండేవని చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో మరిన్ని పురాతన నిధులు ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆ పొలాన్ని కౌలుకు తీసుకోవడానికి రైతులు పోటీ పడుతున్నారని గ్రామంలో చర్చ సాగుతోంది.

అయితే, ఈ ఘటనపై అధికారికంగా పురావస్తు శాఖ లేదా పోలీసుల నుంచి బంగారు ఆభరణాల స్వభావం, విలువ, యాజమాన్యంపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. దొరికిన ఆభరణాలపై విచారణ కొనసాగుతోంది.

📄 Generate e-Paper Clip
Share This Article