హైదరాబాద్: అల్వాల్ పరిధిలోని సర్వే నెంబర్-1లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై HYDRA అధికారులు భారీ చర్యలు చేపట్టారు. అన్యాక్రాంతమైన 108 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
ఈ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి ప్లాట్లుగా విభజించి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు, మాజీ మరియు ప్రస్తుత ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలో HYDRA అధికారులు చర్యలను కొనసాగిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అల్వాల్లో చేపట్టిన ఈ కూల్చివేతలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.